ترجمة سورة المائدة

الترجمة التلجوية
ترجمة معاني سورة المائدة باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిన మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం (హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మ సమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియమించిన) చిహ్నాలను మరియు నిషిద్ధ మాసాన్ని ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీ ఉన్న పశువులకు (హాని చేయకండి). మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (కఅబహ్ కు) పోయే వారిని (ఆటంక పరచకండి). కానీ ఇహ్రామ్ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.
(సహజంగా) మరణించింది, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేరుతో) వధింపబడినది (జిబ్ హ్ చేయబడినది), గొంతు పిసికి ఊపిరాడక, దెబ్బ తగిలి, ఎత్తు నుండి పడి, కొమ్ము తగిలి మరియు క్రూరమృగం నోట పడి చచ్చిన (పశువు / పక్షి) అన్నీ, మీకు తినటానికి నిషిద్ధం (హరామ్) చేయబడ్డాయి. కాని (క్రూర మృగం నోట పడిన దానిని) చావక ముందే మీరు జిబ్ హ్ చేసినట్లైతే అది నిషిద్ధం కాదు. మరియు బలిపీఠం మీద వధించబడినది, మరియు బాణాల ద్వారా శకునం చూడటం నిషేధింపబడ్డాయి. ఇవన్నీ ఘోర పాపాలు (ఫిస్ ఖున్). ఈనాడు సత్యతిరస్కారులు, మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులు కున్నారు. కనుక మీరు వారికి భయపడకండి, నాకే భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను. ఎవడైనా ఆకలికి ఓర్చుకోలేక, పాపానికి పూనుకోక, (నిషిద్ధమైన వస్తువులను తిన్నట్లైతే)! నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
వారు (ప్రజలు) తమ కొరకు ఏది ధర్మ సమ్మతం (హలాల్) అని నిన్ను అడుగు తున్నారు. నీవు ఇలా అను: "పరిశుద్ధ వస్తువులన్నీ మీ కొరకు ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు మీకు అల్లాహ్ నేర్పిన విధంగా మీరు వేట శిక్షణ ఇచ్చిన జంతువులు మీ కొరకు పట్టినవి కూడా! కావున అవి మీ కొరకు పట్టుకున్న వాటిని మీరు తినండి కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్ఛరించండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు."
ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.
ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు.
మరియు మీకు అల్లాహ్ చేసిన అనుగ్రహాన్ని మరియు ఆయన మీ నుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీరు: "మేము విన్నాము మరియు విధేయుల మయ్యాము." అని అన్నారు. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, హృదయాలలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.
మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉన్నాయని అల్లాహ్ వాగ్దానం చేశాడు.
మరియు ఎవరైతే సత్యతిరస్కారానికి పాల్పడి, మా సూచనలను అబద్ధాలని తిరస్కరిస్తారో! అలాంటి వారు భగభగ మండే నరకాగ్ని వాసులవుతారు.
ఓ విశ్వాసులారా! ఒక జాతి వారు (మీకు హాని చేయ సంకల్పించి) తమ చేతులను మీ వైపునకు చాచినపుడు, అల్లాహ్ వారి చేతులను మీ నుండి తొలగించి మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు విశ్వాసులు అల్లాహ్ పైననే నమ్మక ముంచుకుంటారు.
మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము. మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే!"
ఆ పిదప వారు తాము చేసిన ఒడంబడికను భంగం చేసినందుకు, మేము వారిని శపించాము (బహిష్కరించాము) మరియు వారి హృదయాలను కఠినం చేశాము. వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చి వేసేవారు. వారికి ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచిపోయారు. అనుదినం వారిలో ఏ కొందరో తప్ప, పలువురు చేసే ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంది. కనుక వారిని మన్నించు మరియు వారి చేష్టలను ఉపేక్షించు. నిశ్చయంగా అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.
"మేము క్రైస్తవులము." అని అనే వారి నుంచి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము; కాని వారు తమకు ఇవ్వబడిన బోధనలలో అధిక భాగాన్ని మరచి పోయారు; కావున తీర్పుదినం వరకు వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని కల్గించాము. మరియు త్వరలోనే అల్లాహ్ వారు చేస్తూ వచ్చిన కర్మలను గురించి వారికి తెలియజేస్తాడు.
ఓ గ్రంథ ప్రజలారా! వాస్తవంగా మా ప్రవక్త (ముహమ్మద్) మీ వద్దకు వచ్చి వున్నాడు; మీరు కప్పి పుచ్చుతూ ఉన్న గ్రంథం (బైబిల్) లోని ఎన్నో విషయాలను అతను మీకు బహిర్గతం చేస్తున్నాడు; మరియు ఎన్నో విషయాలను ఉపేక్షిస్తున్నాడు. వాస్తవంగా మీ కొరకు అల్లాహ్ తరఫు నుండి ఒక జ్యోతి మరియు ఒక స్పష్టమైన గ్రంథం (ఈ ఖుర్ఆన్) వచ్చి వున్నది.
దాని ద్వారా అల్లాహ్! తన ప్రీతిని పొందగోరే వారికి శాంతి పథాలను చూపుతాడు మరియు తన ఆజ్ఞతో వారిని అంధకారం నుండి వెలుగులోకి తెచ్చి వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
"నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు."
మరియు యూదులు మరియు క్రైస్తవులు ఇలా అంటారు: "మేము అల్లాహ్ సంతానం మరియు ఆయనకు ప్రియమైన వారము." (వారితో) ఇలా అను: "అయితే, ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? అలా కాదు, మీరు కూడ ఆయన పుట్టించిన మానవులలో ఒకరు మాత్రమే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు ఆకాశాలలో, భూమిలో మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద సామ్రాజ్యాధి పత్యం అల్లాహ్ దే మరియు ఆయన వైపునకే (అందరికీ) మరలి పోవలసి ఉంది."
ఓ గ్రంథ ప్రజలారా! ప్రవక్తలు రావటం, ఆగి పోయిన కొంత కాలం తరువాత, మీకు అంతా స్పష్టంగా తెలుపటానికి, వాస్తవంగా మా సందేశహరుడు (ముహమ్మద్) మీ వద్దకు వచ్చాడు. మీరు :"మా వద్దకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు ఎవ్వడూ రాలేదు." అని అనకూడదని. నిస్సందేహంగా ఇప్పుడు మీకు శుభవార్తలు వినిపించేవాడు మరియు హెచ్చరికలు చేసేవాడు వచ్చి వున్నాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
మరియు మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; ఆయన మీలో నుండి ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు మరియు మిమ్మల్ని సార్వభౌములుగా చేశాడు. మరియు (ఆ కాలంలో) ప్రపంచంలో ఎవ్వరికీ ప్రసాదించని వాటిని (అనుగ్రహాలను) మీకు ప్రసాదించాడు."
"నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి ఉంచిన పవిత్ర భూమి (ఫలస్తీన్) లో ప్రవేశించండి. వెనుకకు మరలి రాకండి, అలా చేస్తే నష్టపడి తిరిగి రాగలరు."
(అప్పుడు) వారన్నారు: "ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవేశించము; ఒకవేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము."
(అప్పుడు) భయపడేవారిలో నుండి అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు అన్నారు: "ద్వారం నుండి పోయి వారిపై దాడి చేయండి. మీరు లోనికి ప్రవేశించారంటే నిశ్చయంగా, విజయం మీదే! మీరు వాస్తవానికి విశ్వసించిన వారే అయితే! అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకోండి."
వారన్నారు: "ఓ మూసా! వారు అందు ఉన్నంత వరకు మేము అందులో ఎన్నటికీ ప్రవేశించము. కావున నీవు మరియు నీ ప్రభువు పోయి పోరాడండి, మేము నిశ్చయంగా, ఇక్కడే కూర్చుని ఉంటాము."
(దానికి మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు నాపై మరియు నా సోదరునిపై మాత్రమే అధికారం గలదు. కావున నీవు మా మధ్య మరియు ఈ అవిధేయుల మధ్య తీర్పు చేయి (మమ్మల్ని ఈ అవిదేయుల నుండి దూరం చేయి)."
(అల్లాహ్) అన్నాడు: "ఇక నిశ్చయంగా ఆ భూమి వారి కొరకు నలభై సంవత్సరాల వరకు నిషేధింపబడింది. వారు దేశదిమ్మరులై ఈ భూమిలో తిరుగుతూ ఉంటారు. కావున అవిధేయులైన జనులను గురించి నీవు చింతించకు."
మరియు వారికి ఆదమ్ యొక్క ఇద్దరు కుమారుల (హాబిల్ మరియు ఖాబిల్ ల) యథార్థ కథను వినిపించు. వారిద్దరు (అల్లాహ్ కు) బలి (ఖుర్బానీ) ఇచ్చి నప్పుడు ఒకని (హాబిల్) బలి స్వీకరించ బడింది మరియు రెండవ వాని (ఖాబీల్) బలి స్వీకరించ బడలేదు. (ఖాబీల్) అన్నాడు: "నిశ్చయంగా నేను నిన్ను చంపుతాను." (దానికి హాబీల్) అన్నాడు: "నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారి (బలినే) స్వీకరిస్తాడు.
ఒకవేళ నీవు నన్ను చంపటానికి నీ చేయి నా వైపుకు ఎత్తినా! నేను నిన్ను చంపటానికి నా చేయి నీ వైపుకు ఎత్తను. (ఎందుకంటే) నిశ్చయంగా, నేను సర్వలోకాలకు పోషకుడైన అల్లాహ్ కు భయపడుతున్నాను.
నీవు నీ పాపంతో సహా, నా పాపాన్ని కూడా భరించి నరకవాసులలో ఒకడవు కావాలని నా కోరిక. మరియు ఇదే దుర్మార్గుల ప్రతిఫలం."
చివరికి అతడి మనస్సు అతడిని (తన సోదరుని) హత్యకు పురికొల్పింది, కావున అతడు తన సోదరుణ్ణి (హాబీల్ ను) చంపి నష్టం పొందిన వారిలో చేరి పోయాడు.
అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు; అది నేలను త్రవ్వి అతని సోదరుని శవాన్ని ఎలా దాచాలో చూపించింది. అతడు (ఖాబీల్) :"అయ్యో, నా పాడుగాను! నేను ఈ కాకి పాటి వాణ్ణి కూడా కాలేక పోయాను! నా సోదరుని శవాన్ని దాచే (ఉపాయం) వెతక లేక పోయాను కదా!" అని వాపోయాడు. అప్పుడతడు పశ్చాత్తాప పడే వారిలో చేరి పోయాడు.
ఈ కారుణం వల్లనే మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఈ ఉత్తరువు ఇచ్చాము: "నిశ్చయంగా - ఒక వ్యక్తి (హత్యకు) బదులుగా గానీ లేదా భూమిలో కల్లోలం వ్యాపింపజేసి నందుకు గానీ గాక - ఎవడైనా ఒక వ్యక్తిని (అన్యాయంగా) చంపితే, అతడు సర్వ మానవజాతిని చంపినట్లే, మరియు ఎవడైనా ఒక మానవుని ప్రాణాన్ని కాపాడితే, అతడు సర్వ మానవజాతి ప్రాణాలను కాపాడినట్లే!" మరియు వాస్తవానికి, వారి వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని మా ప్రవక్తలు వచ్చారు, అయినా వాస్తవానికి వారిలో పలువురు భూమిలో అక్రమాలు చేసేవారు.
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో పోరాడుతారో మరియు ధరణిలో కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి మరణ శిక్ష విధించాలి; లేదా శిలువపై ఎక్కించాలి; లేదా వారి అభిముఖ పక్షాల కాళ్ళు - చేతులను నరికించాలి; లేదా వారిని దేశ బహిష్క్రుతుల్ని చేయాలి. ఇది వారికి ఇహలోకంలో గల అవమానం. మరియు వారికి పరలోకంలో కూడా ఘోర శిక్ష ఉంటుంది.
మీరు స్వాధీనపరచుకోక ముందు పశ్చాత్తాప పడేవారు తప్ప! కావున మీరు నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత, అని తెలుసుకోండి.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. మరియు ఆయన మార్గంలో నిరంతరం కృషి చేస్తే మీరు సాఫల్యం పొంద వచ్చు!
నిశ్చయంగా, సత్య తిరస్కారులైన వారు తీర్పుదినాన గల శిక్ష నుండి తప్పించుకోవటానికి - వారి వద్ద ఉంటే - భూమిలో ఉన్న సమస్తాన్ని దానితో పాటు మరి అంత (ధనాన్ని) కూడా, విమోచనా ధనంగా ఇవ్వగోరుతారు కాని అది స్వీకరించబడదు. మరియు వారికి అతి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
వారు నరకాగ్ని నుండి బయటికి రాగోరుతారు, కాని వారు దాని నుండి బయటికి రాజాలరు. మరియు వారికి ఎడతెగని శిక్ష ఉంటుంది.
మరియు పురుషుడు దొంగ అయినా, లేదా స్త్రీ దొంగ అయినా, వారి చేతులను నరికి వేయండి. ఇది వారి కర్మలకు గుణపాఠంగా అల్లాహ్ నిర్ణయించిన ప్రతిఫలం (శిక్ష). మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
ఎవడు నేరం చేసిన తరువాత పశ్చాత్తాప పడి తనను తాను సవరించు కుంటాడో! నిశ్చయంగా, అల్లాహ్ అలాంటి వాని పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఏమీ? నిశ్చయంగా, భూమ్యాకాశాలపై ఆధిపత్యం అల్లాహ్ దేనని నీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు మరియు తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.
ఓ ప్రవక్తా! సత్యతిరస్కారంలోకి పరుగులు తీసే వారి వల్ల నీవు దుఃఖపడకు. అలాంటి వారు: "మేము విశ్వసించాము." అని తమ నోటితో మాత్రమే అంటారు. కాని వారి హృదయాలు విశ్వసించలేదు. మరియు యూదులలో కొందరు అసత్యాలను కుతూహలంతో వినే వారున్నారు మరియు నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజలకు (అందజేయటానికి) మీ మాటలు వినే వారున్నారు. వారు పదాల అర్థాలను మార్చి, వాటి సందర్భాలకు భిన్నంగా తీసుకుని ఇలా అంటారు: "మీకు ఈ విధమైన (సందేశం) ఇస్తేనే స్వీకరించండి మరియు ఇలాంటిది ఇవ్వక పోతే, జాగ్రత్త పడండి!" మరియు అల్లాహ్ ఎవరిని పరీక్షించ దలచాడో (తప్పు దారిలో వదల దలచాడో) వారిని అల్లాహ్ నుండి తప్పించటానికి నీవు ఏమీ చేయలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరిశుద్ధ పరచ గోరలేదో అలాంటి వారు వీరే. వారికి ఇహలోకంలో అవమానం ఉంటుంది. మరియు వారికి పరలోకంలో ఘోర శిక్ష ఉంటుంది.
వారు అబద్ధాన్ని వినేవారు మరియు నిషిద్ధమైన దానిని తినేవారు. కావున వారు నీ వద్దకు (న్యాయానికి) వస్తే, నీవు (ఇష్టపడితే) వారి మధ్య తీర్పు చేయి, లేదా ముఖం త్రిప్పుకో. నీవు వారి నుండి విముఖుడవైతే వారు నీకేమీ హాని చేయ లేరు. నీవు వారి మధ్య తీర్పు చేస్తే, న్యాయంగా మాత్రమే తీర్పు చేయి. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయబద్ధులైన వారిని ప్రేమిస్తాడు.
మరియు - అల్లాహ్ ఉత్తరువులు ఉన్న తౌరాత్ గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ - వారు తీర్పు కొరకు, నీ వద్దకు ఎందుకు వస్తున్నారు? ఆ తరువాత కూడా వారు దాని నుండి తిరిగి పోతున్నారు మరియు ఇలాంటి వారు (నిజానికి) విశ్వసించిన వారు కారు.
నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు. కావున మీరు (యూదులారా) మానవులకు భయపడ కండి. నాకే భయపడండి. నా సూక్తులను (ఆయాత్ లను) స్వల్ప లాభాలకు అమ్ము కోకండి. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన (శాసనం) ప్రకారం తీర్పు చేయరో, అలాంటి వారే సత్యతిరస్కారులు.
మరియు ఆ గ్రంథం (తౌరాత్) లో వారికి మేము: "ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను మరియు గాయాలకు బదులుగా సరిసమానమైన ప్రతీకారం వ్రాశాము. కాని ఎవరైనా దానిని క్షమిస్తే, అది అతనికి పాపపరిహారం (కఫ్ఫారా)! మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు! వారే దుర్మార్గులు.
మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!
మరియు ఇంజీల్ గ్రంథ ప్రజలను, అల్లాహ్! ఆ గ్రంథంలో అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయమను. మరియు ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరో అలాంటి వారు, వారే అవిధేయులు (దుష్టులు).
మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు.
మరియు (ఓ ప్రవక్తా!) నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి మరియు వారి వ్యర్థ కోరికలను అనుసరించకు. అల్లాహ్ నీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు నిన్ను తప్పించకుండా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగి పోతే, అల్లాహ్ వారిని, వారి కొన్ని పాపాలకు శిక్షించదలచాడని తెలుసుకో. మరియు నిశ్చయంగా, ప్రజలలో అనేకులు అవిధేయతకు పాల్పడే వారున్నారు.
ఏమీ? వారు అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? కాని ఆయన (అల్లాహ్) పై నమ్మకం గల వారికి అల్లాహ్ కంటే మంచి తీర్పు చేయగలవాడెవడు?
ఓ విశ్వాసులారా! యూదులను మరియు క్రైస్తవులను మిత్రులుగా చేసుకోకండి. వారు ఒకరి కొకరు స్నేహితులు. మీలో ఎవడు వారితో స్నేహం చేస్తాడో వాస్తవానికి అతడు వారిలో చేరిన వాడవుతాడు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.
కావున ఎవరి హృదయాలలో రోగం (కాపట్యం) ఉందో వారు, వారి సాంగత్యం కొరకు పోటీ పడుతున్నది నీవు చూస్తున్నావు. వారు: "మాపై ఏదైనా ఆపద రాగలదని మేము భయపడుతున్నాము." అని అంటారు. బహుశా అల్లాహ్ (విశ్వాసులకు) విజయాన్ని గానీ, లేదా తన దిక్కు నుండి ఏదైనా అవకాశాన్ని గానీ కలిగించవచ్చు! అప్పుడు వారు తమ మనస్సులలో దాచి ఉంచిన దానికి పశ్చాత్తాప పడతారు.
మరియు విశ్వాసులు (పరస్పరం ఇలా అనుకుంటారు): "ఏమీ? వాస్తవానికి మేము మీతోనే ఉన్నామని, అల్లాహ్ పేరుతో కఠోర ప్రమాణాలు చేసి, నమ్మకం కలిగించే వారు వీరేనా?" వారి (కపటవిశ్వాసుల) కర్మలన్నీ వ్యర్థమై, వారు నష్టపడిన వారవుతారు!
ఓ విశ్వాసులారా! మీలో ఎవడైనా తన ధర్మం (ఇస్లాం) నుండి వైదొలగితే, అల్లాహ్ త్వరలోనే ఇతర ప్రజలను తేగలడు. ఆయన వారిని ప్రేమిస్తాడు మరియు వారు ఆయన (అల్లాహ్) ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల పట్ల మృదువుగా, సత్యతిరస్కారుల పట్ల కఠినంగా ప్రవర్తించే వారునూ, అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం చేసే వారూను మరియు నిందించే వారి నిందలకు భయపడని వారూనూ, అయి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహం, ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వోపగతుడు (సర్వవ్యాప్తి), సర్వజ్ఞుడు.
నిశ్చయంగా, మీ స్నేహితులు, అల్లాహ్! ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు: ఎవరైతే నమాజ్ స్థాపిస్తారో, విధిదానం (జకాత్) ఇస్తూ ఉంటారో మరియు వారు (అల్లాహ్ ముందు) వంగుతూ (రుకూఉ చేస్తూ) ఉంటారో;
మరియు ఎవరు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారి వైపునకు మరలుతారో! నిశ్చయంగా, వారే అల్లాహ్ పక్షానికి చెందినవారు, వారే విజయం సాధించేవారు.
ఓ విశ్వాసులారా! మీ ధర్మాన్ని ఎగతాళిగా నవ్వులాటగా పరిగణించేవారు పూర్వగ్రంథ ప్రజలైనా, లేదా సత్యతిరస్కారులైనా, వారిని మీ స్నేహితులుగా చేసుకోకండి. మరియు మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
మరియు మీరు నమాజ్ కొరకు పిలుపు (అజాన్) ఇస్తే, వారు దానిని ఎగతాళిగా, నవ్వులాటగా తీసుకుంటారు. అది ఎందుకంటే వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు!
వారితో ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామనే, మీరు మమ్మల్ని పీడిస్తున్నారా? మరియు నిశ్చయంగా, మీలో చాలా మంది అవిధేయులు (దుష్టులు) ఉన్నారు!"
ఇలా అను: "ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే!"
మరియు వారు (కపట విశ్వాసులు) నీ వద్దకు వచ్చినప్పుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వాస్తవానికి వారు సత్యతిరస్కారంతోనే వస్తారు మరియు దాని (సత్యతిరస్కారం) తోనే తిరిగి పోతారు కూడాను. మరియు వారు ఏమి దాస్తున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు.
మరియు వారిలో అనేకులను పాపం మరియు దౌర్జన్యం చేయటానికి మరియు నిషిద్ధమైనవి తినటానికి చురుకుగా పాల్గొనటాన్ని నీవు చూస్తావు. వారు చేస్తున్న పనులు ఎంత నీచమైనవి!
వారి ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) మరియు మతాచారులు (అహ్ బార్) వారిని, పాపపు మాటలు పలకటం నుండి మరియు నిషిద్ధమైన వాటిని తినటం నుండి ఎందుకు వారించరు? వారు చేసే కార్యాలు ఎంత నీచమైనవి!
మరియు యూదులు: "అల్లాహ్ చేతులకు సంకెళ్ళు పడి ఉన్నాయి." అని అంటారు. వారి చేతులకే సంకెళ్ళు వేయబడుగాక! మరియు వారు పలికిన దానికి వారు శపించబడుగాక! వాస్తవానికి ఆయన (అల్లాహ్) రెండు చేతులు విస్తరింపబడి ఉన్నాయి; ఆయన (తన అనుగ్రహాలను) తాను కోరినట్లు ఖర్చు చేస్తాడు. మరియు (ఓ ప్రవక్తా!) నీ ప్రభువు తరపు నుండి నీపై అవతరింపజేయబడినది (ఈ గ్రంథం) నిశ్చయంగా, వారిలో చాలా మందికి తలబిరుసుతనం మరియు సత్య తిరస్కారాన్ని మాత్రమే పెంచుతున్నది. మరియు మేము వారి మధ్య విరోధాన్ని మరియు ద్వేషాన్ని, తీర్పుదినం వరకు ఉండేటట్లు చేశాము. వారు యుద్ధ జ్వాలలను ప్రజ్వలింపజేసినపుడల్లా, అల్లాహ్ దానిని చల్లార్చాడు. మరియు వారు భూమిలో కల్లోలం రేకెత్తించటానికి పాటు పడుతున్నారు. మరియు అల్లాహ్ కల్లోలం రేకెత్తించే వారిని ప్రేమించడు.
మరియు వాస్తవానికి గ్రంథ ప్రజలు విశ్వసించి, దైవభీతి కలిగి వుంటే! నిశ్చయంగా, మేము వారి పాపాలను తొలగించి, వారిని శ్రేష్ఠమైన స్వర్గవనాలలో ప్రవేశింపజేసి ఉండేవారము.
మరియు వాస్తవానికి వారు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు వారి ప్రభువు తరఫు నుండి వారిపై (ఇప్పుడు) అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించి ఉండినట్లైతే, వారి కొరకు వారిపై (ఆకాశం) నుండి మరియు కాళ్ళ క్రింది నుండి (భూమి నుండి) జీవనోపాధి పొందేవారు. వారిలో కొందరు సరైన మార్గాన్ని అవలంబించే వారున్నారు. కాని వారిలో అనేకులు చేసేవి చెడు (పాప) కార్యాలే!
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి. మరియు నీవట్టు చేయక పోతే, ఆయన సందేశాన్ని పూర్తిగా తెలియజేయని వాడవవుతావు. మరియు అల్లాహ్ మానవుల నుండి నిన్ను కాపాడతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు.
ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు.
నిశ్చయంగా, ఈ (గ్రంథాన్ని) విశ్వసించిన వారు (ముస్లింలు) మరియు యూదులు మరియు సాబీయూలు మరియు క్రైస్తవులు, ఎవరైనా సరే అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తే, సత్కార్యాలు చేస్తే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా.
వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారి నుండి ఒక గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము మరియు వారి వద్దకు ప్రవక్తలను పంపాము. కాని ఏ ప్రవక్త అయినా వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని తెచ్చినపుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు, మరి కొందరిని హత్య చేశారు.
మరియు తమకెలాంటి శిక్ష (ఫిత్నా) పడదని తలచి, వారు గ్రుడ్డి వారుగా, చెవిటి వారుగా అయిపోయారు. ఆ పిదప అల్లాహ్ వారి పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. ఆ తరువాత కూడ వారిలో అనేకులు తిరిగి గ్రుడ్డి వారుగా, చెవిటి వారుగా అయి పోయారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.
"నిశ్చయంగా, మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని పలికే వారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీహ్ (క్రీస్తు) ఇలా అన్నాడు: "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ నే ఆరాధించండి. వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు.
"నిశ్చయంగా, అల్లాహ్ ముగ్గురిలో మూడవవాడు!" అని అనేవారు వాస్తవానికి సత్యతిరస్కారులో. మరియు ఒకే ఒక్క ఆరాధ్యదేవుడు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. మరియు వారు తమ ఈ మాటనలు మానుకోకపోతే, వారిలో సత్యతిరస్కారులైన వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
వారెందుకు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలి ఆయనను క్షమాభిక్ష కొరకు వేడుకోరు? మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!
ఇలా అను: "ఏమీ? మీరు అల్లాహ్ ను వదిలి, మీకు నష్టం గానీ, లాభం గానీ చేసే అధికారం లేని దానిని ఆరాధిస్తారా? మరియు కేవలం అల్లాహ్ మాత్రమే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు."
(ఇంకా) ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీ ధర్మం విషయంలో మీరు అధర్మంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు ఇంతకు పూర్వం మార్గభ్రష్టులైన వారి కోరికలను అనుసరించకండి. వారు అనేక ఇతరులను కూడా మార్గభ్రష్టులుగా చేశారు మరియు వారు కూడ ఋజుమార్గం నుండి తప్పిపోయారు."
ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు. ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం.
వారు, తాము చేసే, అసభ్యకరమైన కార్యాల నుండి ఒకరినొకరు నిరోధించు కోలేదు. వారు చేసే పనులన్నీ ఎంతో నీచమైనవి.
వారిలో అనేకులు సత్యతిరస్కారులతో మైత్రి చేసుకోవటాన్ని, నీవు చూస్తున్నావు. వారు తమ కొరకు ముందుగా చేసి పంపుకున్న నీచ కర్మల వలన అల్లాహ్ కు వారిపై కోపం కలిగింది మరియు వారు నరకబాధలో శాశ్వతంగా ఉంటారు.
ఒకవేళ వారు అల్లాహ్ నూ, ప్రవక్తనూ మరియు అతనిపై అవతరింపజేయబడిన దానిని (నిజంగానే) విశ్వసించి ఉంటే! వారిని (సత్యతిరస్కారులను0 తమ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు, కాని వారిలో అనేకులు అవిధేయులున్నారు.
నిశ్చయంగా, విశ్వాసుల పట్ల (ముస్లింల పట్ల) విరోధ విషయంలో నీవు యూదులను మరియు బహుదైవారాధకును (ముష్రికీన్ లను), అందరి కంటే కఠినులుగా కనుగొంటావు. మరియు విశ్వాసుల పట్ల మైత్రి విషయంలో: "నిశ్చయంగా, మేము క్రైస్తవులము." అని , అన్న వారిని అత్యంత సన్నిహితులుగా పొందుతావు. ఇది ఎందుకంటే వారిలో మతగురువులు /విద్వాంసులు (ఖిస్సీసీన్) మరియు మునులు (రుహ్ బాన్) ఉన్నారు మరియు నిశ్చయంగా, వారు గర్వించరు.
మరియు వారు (కొందరు క్రైస్తవులు) ప్రవక్తపై అవతరింపజేయబడిన దానిని (ఈ గ్రంథాన్ని) విన్నప్పుడు, సత్యాన్ని తెలుసు కున్నందుకు, వారి కళ్ళ నుండి కన్నీళ్ళు కారటం నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కావున మమ్మల్ని సాక్ష్యం ఇచ్చే వారిలో వ్రాసుకో!
"మరియు మేము అల్లాహ్ మరియు మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించకుండా ఉండటానికి మాకేమైంది? మా ప్రభువు మమ్మల్ని సద్వర్తనులతో చేర్చాలని మేము కోరుకుంటున్నాము."
కావున వారు పలికిన దానికి ఫలితంగా, అల్లాహ్ వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలను ప్రసాదించాడు. వారందులో శాశ్వతంగా ఉంటారు. మరియు సజ్జనులకు లభించే ప్రతిఫలం ఇదే!
మరియు ఎవరైతే సత్యతిరస్కారులై మా సూచనలను (ఆయాత్ లను) అబద్ధాలన్నారో, అలాంటి వారు భగభగమండే నరకాగ్ని వాసులవుతారు.
ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు ధర్మసమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి మరియు హద్దులు మీరకండి. నిశ్ఛయంగా, అల్లాహ్ హద్దులు మీరి పోయే వారిని ప్రేమించడు.
మరియు అల్లాహ్ మీకు జీవనోపాధిగా ప్రసాదించిన వాటిలో ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన పదార్థాలను తినండి. మీరు విశ్వసించిన అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
మీరు ఉద్దేశం లేకుండానే చేసిన ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధిపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని (తప్పకుండా) పట్టుకుంటాడు. కావున దానికి (ఇలాంటి ప్రమాణ భంగానికి) పరిహారంగా మీరు మీ ఇంటి వారికి పెట్టే, మధ్యరకమైన ఆహారం పది మంది పేదలకు పెట్టాలి. లేదా వారికి వస్త్రాలు ఇవ్వాలి. లేదా ఒక బానిసకు స్వాతంత్ర్యం ఇప్పించాలి. ఎవడికి ఈ శక్తి లేదో! అతడు మూడు దినాలు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, ఇది దానికి పరిహారం (కఫ్ఫారా). మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞులై ఉండటానికి అల్లాహ్ తన ఆజ్ఞలను ఈ విధంగా మీకు విశదపరుస్తున్నాడు.
ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.
నిశ్చయంగా, షైతాన్ మధ్యపానం మరియు జూదం ద్వారా మీ మధ్య విరోధాలు మరియు విద్వేషాలు రేకెత్తించాలని మరియు మిమ్మల్ని అల్లాహ్ ధ్యానం నుండి మరియు నమాజ్ నుండి తొలగించాలని కోరుతున్నాడు. అయితే మీరిప్పుడైనా మానుకోరా?
మరియు మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు ప్రవక్తను అనుసరించండి. జాగ్రత్త! మీరు ఒకవేళ తిరిగిపోతే! నిశ్చయంగా, మా ప్రవక్త బాధ్యత కేవలం (మా ఆజ్ఞను) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే అని తెలుసుకోండి.
విశ్వసించి సత్కార్యాలు చేసే వారిపై, (ఇంతకు ముందు) వారు తిన్న (త్రాగిన) దాన్ని గురించి దోషం లేదు; ఒకవేళ వారు దైవభీతి కలిగి ఉండి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తూ ఉంటే, ఇంకా దైవభీతి కలిగి ఉండి విశ్వాసులైతే, ఇంకా దైవభీతి కలిగి ఉండి సజ్జనులైతే! మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.
ఓ విశ్వాసులారా! (మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు) - మీ ఇంద్రియాలకు అగోచరమైన అల్లాహ్ కు ఎవరు భయపడాతో చూడటానికి - అల్లాహ్ మీ చేతులకు మరియు మీ బల్లెములకు అందుబాటులో ఉన్న కొన్ని వేట (జంతువుల) ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురి చేస్తాడు. కావున ఈ (హెచ్చరిక) తరువాత కూడా ఎవడు హద్దును అతిక్రమిస్తాడో, వాడికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.
సముద్ర జంతువులను వేటాడటం మరియు వాటిని తినటం, జీవనోపాధిగా మీకూ (స్థిరనివాసులకూ) మరియు ప్రయాణీకులకూ ధర్మసమ్మతం చేయబడింది. కానీ, మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకూ భూమిపై వేటాడటం మీకు నిషేధింపబడింది. కావున మీరు (పునరుత్థాన దినమున) ఎవరి ముందు అయితే సమావేశ పరచ బడతారో ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
అల్లాహ్ పవిత్ర గృహం అయిన కఅబహ్ ను మానవజాతి కొరకు, సురక్షితమైన శాంతి నిలయంగా (బైతుల్ హరామ్ గా) చేశాడు. మరియు పవిత్ర మాసాన్ని మరియు బలి (హద్ య) పశువులను మరియు మెడలలో పట్టాలు వేసి కఅబహ్ కు ఖుర్బానీ కొరకు తేబడే పశువులను (ఖలా ఇదలను) కూడా నియమించాడు. ఇది ఆకాశాలలోను మరుయ భూమిలోను ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ ఎరుగునని, మీరు తెలుసుకోవాలని! మరియు నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి ఒక్క విషయం గురించి బాగా తెలుసు.
నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో కఠినుడని తెలుసుకోండి మరియు నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
సందేశహరుని బాధ్యత కేవలం (అల్లాహ్ సందేశాలను) మీకు అందజేయటమే! మరియు మీరు వెలి బుచ్చేది మరియు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
(ఓ ప్రవక్తా!) ఇలా అను: "చెడు వస్తువుల ఆధిక్యత నీకు ఎంత నచ్చినా! చెడు మరియు మంచి వస్తువులు సరిసమానం కాజాలవు. కావున ఓ బుద్ధిమంతులారా! మీరు సాఫల్యం పొందాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి."
ఓ విశ్వాసులారా! వ్యక్త పరిస్తే మీకు బాధ కలిగించెడు విషయాలను గురించి, మీరు ప్రశ్నించకండి. ఖుర్ఆన్ అవతరింప జేయబడే టప్పుడు, మీరు వాటిని గురించి ప్రశ్నిస్తే! అవి మీకు విశదపరచ బడవచ్చు! వాటి కొరకు (ఇంత వరకు మీరు చేసిన ప్రశ్నల కొరకు) అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు మరియు అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.
వాస్తవానికి మీకు పూర్వం ఒక జాతి వారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. తరువాత వాటి (ఆ ప్రశ్నల) కారణంగానే వారు సత్యతిరస్కారానికి గురి అయ్యారు.
అల్లాహ్ బహీరహ్ ను గానీ, సాయిబహ్ ను గానీ, వసీలహ్ ను గానీ లేక హామ్ ను గానీ నియమించలేదు. కాని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్ధాలు కల్పిస్తున్నారు. మరియు వారిలో చాలా మంది బుద్ధిహీనులే!
మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని పిలిచినప్పుడు! వారు: "మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!" అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)?
ఓ విశ్వాసులారా! మీ స్వయానికి మీరు బాధ్యత వహించండి. మీరు సన్మార్గంలో ఉంటే, మార్గభ్రష్టులైన వారు మీకు ఎలాంటి హాని చేయలేరు. మీరంతా అల్లాహ్ వైపునకే మరలి పోవలసి వుంది. అప్పుడు ఆయన మీరేమేమి చేస్తూ ఉండే వారో మీకు తెలియజేస్తాడు.
ఓ విశ్వాసులారా! మీలో ఎవరికైనా మరణ సమయం ఆసన్నమైతే, మీరు వీలునామా వ్రాసేటప్పుడు, మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి, అక్కడ మీకు మరణ ఆపద సంభవిస్తే, మీ వారు (ముస్లింలు లేకుంటే) ఇతరులను ఎవరినైనా ఇద్దరిని (సాక్షులుగా) తీసుకోవచ్చు. ఆ ఇద్దరినీ నమాజ్ తరువాత ఆపుకోండి. మీకు సందేహముంటే, వారిద్దరూ అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అనాలి: "మా దగ్గరి బంధువు కొరకైనా సరే మేము స్వార్థం కొరకు మా సాక్ష్యాన్ని అమ్మము. మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచము. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, పాపాత్ములలో లెక్కింప బడుదుము గాక!"
కాని, ఆ తరువాత ఆ ఇద్దరు (సాక్షులు) పాపం చేశారని తెలిస్తే! అప్పుడు మొదటి ఇద్దరి (సాక్ష్యం) వలన హక్కును కోల్పోయిన వారి (బంధువుల)లో నుండి ఇద్దరు, మొదటి వారిద్దరికి బదులుగా నిలబడి అల్లాహ్ పై శపథం చేసి ఇలా అనాలి: "మా సాక్ష్యం వీరువురి సాక్ష్యం కంటే ఎక్కువ హక్కు గలది (సత్యమైనది). మరియు మేము ఏ విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము ఆ విధంగా చేస్తే నిశ్చయంగా, అన్యాయపరులలో చేరి పోదుము గాక!"
ఇది (ఈ పద్ధతి) ప్రజలు నిజమైన సాక్ష్యం ఇవ్వటానికి లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకొనబడే ప్రమాణాలు ఖండిస్తాయని వారిని భయపెట్టటానికి ఉత్తమమైనది. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన ఆదేశాలను) వినండి. మరియు అల్లాహ్ అవిధేయులకు సన్మార్గం చూపడు.
ఆ రోజు అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచి: "మీకేమి జవాబు ఇవ్వబడింది?" అని అడిగితే! వారు: "మాకు యథార్థ జ్ఞానం లేదు! నిశ్చయంగా, నీవు మాత్రమే సర్వ అగోచర విషయాల జ్ఞానం గలవాడవు." అని పలుకుతారు.
(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను. మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారి పోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి. మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినపుడు, వారిలోని సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు!" అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను!
మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: "నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: " మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలను అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!"
(జ్ఞాపకం చేసుకోండి!) ఆ శిష్యులు (హవారియ్యూన్): "ఓ మర్యమ్ కుమారుడవైన ఈసా (ఏసూ) ఏమీ? నీ ప్రభువు మా కొరకు ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళెం దింపగలడా?" అని అడిగారు! దానికి (ఈసా): "మీరు వాస్తవానికి విశ్వాసులే అయితే, అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి!" అని అన్నాడు.
వారు: "వాస్తవానికి, మేము దాని నుండి తిని, మా హృదయాలను తృప్తి పరచు కోవటానికి మరియు నీవు మాతో సత్యం పలికావని తెలుసు కోవటానికి మరియు దానిని గురించి మేము సాక్షులుగా ఉండటానికి, మేమిలా కోరుతున్నాము!" అని అన్నారు.
దానికి మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు): "ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటివాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరపు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!" అని ప్రార్థించాడు.
(అప్పుడు) అల్లాహ్: "నిశ్చయంగా, నేను దానిని మీపై అవతరింపజేస్తాను (దింపుతాను). కాని, దాని తరువాత కూడా మీలో ఎవడైనా సత్యతిరస్కారానికి పాల్పబడితే! నిశ్చయంగా, వానికి నేను ఇంత వరకు సర్వలోకాలలో ఎవ్వడికీ విధించని శిక్షను విధిస్తాను!" అని అన్నాడు.
మరియు (జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్ :"ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) ఏమీ? నీవు ప్రజలతో: 'అల్లాహ్ కు బదులుగా నన్నూ మరియు నా తల్లినీ ఆరాధ్యులుగా చేసుకోండి!" అని చెప్పావా?" అని ప్రశ్నించగా! దానికి అతను (ఈసా) అంటాడు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు. నాకు పలకటానికి అర్హతలేని మాటను నేను పలకటం తగినపని కాదు. ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే నీకు తప్పక తెలిసి ఉండేది. నా మనస్సులో ఉన్నది నీకు తెలుసు, కాని నీ మనస్సులో ఉన్నది నాకు తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వ అగోచర విషయాలు తెలిసినవాడవు!
"నీవు ఆదేశించింది తప్ప, నేను మరేమీ వారికి చెప్పలేదు, అంటే: ' నా ప్రభువు మరియు మీ ప్రభువు అయిన అల్లాహ్ నే ఆరాధించండి.' అని. నేను వారి మధ్య ఉన్నంత వరకు వారికి సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. మరియు నీవే ప్రతి దానికి సాక్షివి!"
"ఒకవేళ నీవు వారిని శిక్షించదలిస్తే వారు నీ దాసులే! మరియు నీవు వారిని క్షమించదలిస్తే! నీవు సర్వశక్తిమంతుడవు, మహా వివేచనాపరుడవు!"
అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్నులవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!"
ఆకాశాల పైననూ, భూమి పైననూ మరియు వాటిలో నున్న సమస్తం పైననూ, సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ దే! మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు (అన్నింటిపై అధికారం గలవాడు).
Icon