surah.translation .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

ఎంతవరకైతే స్పష్టమైన నిదర్శనం రాదో! అంత వరకు సత్యతిరస్కారులైన పూర్వగ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు (తమ సత్యతిరస్కారాన్ని) మానుకునేవారు కారు!
అల్లాహ్ తరఫు నుండి వచ్చిన సందేశహరుడు, వారికి పవిత్ర గ్రంథ పుటలను వినిపిస్తున్నాడు.
అందులో సమంజసమైన వ్రాతలు (సత్యోపదేశాలు) ఉన్నాయి.
మరియు స్పష్టమైన సూచన వచ్చిన తర్వాతనే గ్రంథ ప్రజలు భేదాభిప్రాయలలో పడ్డారు.
మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము."
నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు.
వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.