ترجمة سورة هود

الترجمة التلجوية
ترجمة معاني سورة هود باللغة التلجوية من كتاب الترجمة التلجوية .
من تأليف: مولانا عبد الرحيم بن محمد .

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి;
మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే!
మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకుంటే, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే, ఆయన మీకు నిర్ణయించిన గడువు వరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి ఒక్కనికీ ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు కానీ, మీరు వెనుదిరిగితే! నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను!
అల్లాహ్ వైపునకే మీ మరలింపు ఉంది. మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు."
వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ, ఆయన (అల్లాహ్) కు వారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు.
మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు. అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.
మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (అర్ష్) నీటి మీద ఉండెను. మీలో మంచిపనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: "నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు తప్పక అంటారు: "ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే."
మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.
మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశ చెంది, కృతఘ్నుడవుతాడు.
కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!" అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో, విర్రవీగుతాడు.
కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
(ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని విడిచి పెట్టనున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో! ఎందుకంటే, (సత్యతిరస్కారులు): "ఇతనిపై ఒక నిధి ఎందుకు దింప బడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?" అని అంటున్నారని. నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే. మరియు అల్లాహ్ యే ప్రతిదాని కార్యసాధకుడు.
లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"
ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?
ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారి కెలాంటి లోపం జరుగదు.
అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటు పడినదంతా వ్యర్థమయి పోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి.
ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో! మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు.
మరియు అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశ పెట్టబడతారు. అప్పుడు: "వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు." అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది.
ఎవరు అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటి వారు, వారే! పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు.
అలాంటి వారు భూమిలో (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించు కోలేరు. మరియు వారికి అల్లాహ్ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. (ఇహలోకంలో వారు సత్యాన్ని) విన లేక పోయేవారు మరియు చూడలేక పోయేవారు.
అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని వీడి పోతాయి.
నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు.
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమై పోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు.
ఈ ఉభయ పక్షాల వారిని, ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు! ఏమీ? పోలికలో వీరిరువురూ సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా?
మరియు వాస్తవానికి మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. (అతను వారితో అన్నాడు): "నిశ్చయంగా, నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే -
మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను."
అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము." అని అన్నారు.
అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను (నిదర్శనాన్ని) అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా?
"మరియు ఓ నా జాతి ప్రజలారా! నేను దాని కోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గరనే ఉంది. మరియు నేను విశ్వసించిన వారిని త్రోసి వేయలేను. నిశ్చయంగా, వారైతే తమ ప్రభువును కలుసుకుంటారు, కాని నిశ్చయంగా నేను మిమ్మల్ని మూఢ జనులుగా చూస్తున్నాను.
"మరియు ఓ నాజాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటి వేస్తే నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి, ఎవడు కాపాడ గలడు? ఏమీ? మీరిది గ్రహించలేరా?
"మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గానీ మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ నేను మీతో అనటం లేదు; మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. అలా అయితే! నిశ్చయంగా, నేను దుర్మార్గులలో చేరిన వాడనే!"
వారు అన్నారు: "ఓ నూహ్! నీవు మాతో వాదించావు, చాలా వాదించావు, ఇక నీవు సత్యవంతుడవే అయితే నీవు భయపెట్టే దానిని (ఆ శిక్షను) మాపై దింపు!"
అతను (నూహ్) అన్నాడు: "అల్లాహ్ కోరితే నిశ్చయంగా, దానిని (ఆ శిక్షను) మీ పైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!
ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచి పెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా, నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలి పోవలసి ఉన్నది."
ఏమీ? వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు" అని అంటున్నారా? వారితో ఇలా అను: "నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు."
మరియు నూహ్ కు ఇలా సందేశం (వహీ) పంపబడింది: " నిశ్చయంగా, నీ జాతి వారిలో ఇంత వరకు విశ్వసించిన వారు తప్ప ఇతరులెవ్వరూ విశ్వసించరు, కావున వారు చేసే కార్యాలకు నీవు చింతించకు!
మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా, వారు ముంచి వేయ బడతారు."
మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను (నూహ్) వారితో అనేవాడు: "ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా, మీరు పరిహాసాలాడినట్లే, మేము కూడా మీతో పరిహాసాలాడుతాము.
అవమానకరమైన శిక్ష ఎవరి పైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు."
చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). అప్పుడు మేము (నూహ్ తో) అన్నాము: "ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ మగ) జంటలను మరియు నీ కుటుంబం వారిని - ఇది వరకే సూచించబడిన వాడు తప్ప - మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!" అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే.
మరియు (నూహ్) అన్నాడు: "ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ నుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): "ఓ నా కుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసిపోకు!"
మరియు అతడు (కుమారుడు) అన్నాడు: "నేను ఒక కొండ పైకి ఎక్కి శరణు పొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది." (నూహ్) అన్నాడు: "ఈ రోజు అల్లాహ్ తీర్పుకు విరుద్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన (అల్లాహ్) యే కరుణిస్తే తప్ప!" అప్పుడే వారి మధ్య ఒక కెరటం రాగా అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసి పోయాడు.
ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది: "ఓ భూమీ! నీ నీళ్ళను మ్రింగివేయి. ఓ ఆకాశమా! (కురవటం) ఆపి వేయి!" అప్పుడు నీరు (భూమిలోకి) ఇంకి పోయింది. (అల్లాహ్) తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండ మీద ఆగింది. మరియు అప్పుడు: "దుర్మార్గుల జాతివారు దూరమై (నాశనమై) పోయారు!" అని అనబడింది.
మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు! నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి."
ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు. అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను."
నూహ్ ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించక పోతే, నన్ను కరణించక పోతే, నేను నష్టపోయిన వారిలో చేరుతాను."
ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: "ఓ నూహ్! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో (ఓడ /జూదీ పర్వతం నుండి) దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది."
(ఓ ప్రవక్తా!) ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం (వహీ) ద్వారా తెలుపు తున్నాము. వాటిని నీవు గానీ, నీ జాతి వారు గానీ ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనం వహించు! నిశ్చయంగా, మంచి ఫలితం దైవభీతి గల వారికే లభిస్తుంది.
మరియు ఆద్ జాతివారి దగ్గరికి వారి సహోదరుడు హూద్ ను పంపాము. అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు!
ఓ నా జాతి ప్రజలారా! (ఈ పనికి) నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ? మీరు బుద్దిని ఉపయోగించరా (అర్థం చేసుకోలేరా)?
మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి, ఆయన మీ కొరకు ఆకాశం నుండి భారీ వర్షాలు కురిపిస్తాడు మరియు మీకు, మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు, కావున మీరు నేరస్థులై వెనుదిరగకండి!"
వారు అన్నారు: "ఓ హూద్! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము.
"మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు (నిన్ను పిచ్చికి గురి చేశారు) అని మాత్రమే మేము అనగలము!" అతను (హూద్) జవాబిచ్చాడు: "ఆయన (అల్లాహ్) తప్ప! మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా, నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి;
ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి.
నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు. నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గంపై (సత్యంపై) ఉన్నాడు.
"ఒకవేళ మీరు వెనుదిరిగితే (మీ ఇష్టం), వాస్తవానికి నేనైతే, నాకివ్వబడిన సందేశాన్ని మీకు అంద జేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏ మాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా, నా ప్రభువే ప్రతిదానికీ రక్షకుడు.
మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము!
మరియు వీరే ఆద్ జాతివారు! వారు తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి (సత్య) విరోధి ఆజ్ఞలను అనుసరించారు!
మరియు ఇహలోకంలో (అల్లాహ్) శాపం (బహిష్కారం) వారిని వెంబడింప జేయబడింది మరియు పునరుత్థాన దినమున కూడా (అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు). వినండి! నిస్సందేహంగా, ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా! హూద్ జాతి వారైన ఆద్ లు ఎలా (అల్లాహ్ కారుణ్యానికి) దూరమై పోయారో!
ఇక సమూద్ వారి వద్దకు వారి సహోదరుడు సాలిహ్ ను పంపాము. అతను అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, దానిలో మిమ్మల్ని నివసింప జేశాడు. కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. (మీ ప్రార్థనలకు) జవాబిస్తాడు."
వారన్నారు: "ఓ సాలిహ్! ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని (దైవాలను) ఆరాధించకుండా, మమ్మల్ని ఆపదలచుకున్నావా? నీవు మాకు బోధించే (ధర్మం) విషయం గురించి వాస్తవంగా మాకు చాలా సందేహం ఉంది."
(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి సోదరులారా! ఏమీ? మీరు చూడరా (ఆలోచించరా)? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన (నిదర్శనంపై) ఉన్నాను. మరియు ఆయన నాకు తన కారణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన (అల్లాహ్) ఆజ్ఞను ఉల్లంఘిస్తే, అల్లాహ్ కు విరుద్ధంగా నాకు ఎవడు సహాయ పడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమీ అధికం చేయటం లేదు.
"మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు."
అయినా వారు దానిని, వెనుక కాలి మోకాలి నరం కోసి చంపారు. అప్పుడు అతను (సాలిహ్) వారితో అన్నాడు: "మీరు మీ ఇండ్లలో మూడు రోజులు మాత్రమే హాయిగా గడపండి. ఇదొక వాగ్దానం, ఇది అబద్ధం కాబోదు."
ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు, మేము సాలిహ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు! ఆయన మాత్రమే, మహా బలవంతుడు, సర్వ శక్తి సంపన్నుడు.
మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడి పోయారు;
వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి! వాస్తవానికి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా! సమూద్ వారెలా దూరమై పోయారో (నశించి పోయారో)!
మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అతను: "మీకూ శాంతి కలుగు గాక (సలాం)!" అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా, వేపిన దూడను (వారి ఆతిథ్యానికి) తీసుకొని వచ్చాడు.
కానీ వారి చేతులు దాని వైపు పోక పోవటం చూసి వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగు తుందేమోనని భయపడ్డాడు! వారన్నారు: "భయపడకు! వాస్తవానికి మేము లూత్ జాతి వైపునకు పంపబడినవారము (దూతలము)."
అతని (ఇబ్రాహీమ్) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్ హాఖ్ యొక్క మరియు ఇస్ హాఖ్ తరువాత యఅఖూబ్ యొక్క శుభవార్తను ఇచ్చాము.
ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: "నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే!"
వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు.
అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు.
(ఎందుకంటే) వాస్తవానికి ఇబ్రాహీమ్ సహనశీలుడు, మృదు హృదయుడు (నమ్రతతో అల్లాహ్ ను అర్థించేవాడు) మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలేవాడు!
(వారన్నారు): "ఓ ఇబ్రాహీమ్! దీనిని (నీ మధ్యవర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి వున్నది. మరియు నిశ్చయంగా, వారిపై ఆ శిక్ష పడటం తప్పదు; అది నివారించబడదు."
మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చినపుడు, వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను: "ఈ దినం చాలా ఆందోళనకరమైనది." అని వాపోయాడు.
మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను (లూత్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు. వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ? మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా?"
వారన్నారు: "నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు!"
అతను (లూత్) అన్నాడు: "మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే, లేక శరణు పొందటానికి పటిష్ఠమైన ఆధారమైనా ఉండి ఉంటే ఎంత బాగుండేది?"
వారు (దైవదూతలు) అన్నారు: "ఓ లూత్! నిశ్చయంగా మేము నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన దూతలము! వారు ఏ మాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు - నీ భార్య తప్ప - మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడగూడదు. నిశ్చయంగా, వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె (నీ భార్య) కూ సంభవిస్తుంది. నిశ్చయంగా, వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమీ? ఉదయం సమీపంలోనే లేదా?
మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.
అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు.
ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము. అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.
"మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి. మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోల్లాన్ని వ్యాపింపజేయకండి.
"మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. మరియు నేను మీ రక్షకుడను కాను."
వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా? (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!"
అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) ? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయ దలచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించ దలచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి వుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను.
"మరియు ఓ నా జాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, హూద్ జాతి వారిపై లేక సాలిహ్ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురి చేయకూడదు సుమా! మరియు లూత్ జాతివారు మీకు ఎంతో దూరం వారు కారు కదా!
"మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు అపార కరుణా ప్రదాత, వాత్సల్యుడు."
వారన్నారు: "ఓ షుఐబ్! నీవు చెప్పే మాటలు చాలా వరకు మేము గ్రహించ లేక పోతున్నాము. మరియు నిశ్చయంగా, నీవు మాలో బలహీనుడివిగా పరిగణించ బడుతున్నావు. మరియు నీ కుటుంబం వారే గనక లేకుంటే! మేము నిశ్చయంగా, నిన్ను రాళ్ళు రువ్వి చంపేవారం. మరియు నీవు మా కంటే శక్తి శాలివి కావు."
అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన (అల్లాహ్) ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా, నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు.
"మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, (నా శక్తి మేరకు) నేను కూడా చేస్తాను. అవమాన కరమైన శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవడో మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి, నిశ్చయంగా, మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను."
చివరకు మా ఆదేశం వచ్చినప్పుడు, మేము షుఐబ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. మరియు దుర్మార్గులైన వారిపై ఒక తీవ్రమైన అరుపు (ధ్వని) విరుచుకు పడింది. కాబట్టి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడిపోయారు -
వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు!
మరియు నిశ్చయంగా, మేము మూసాను కూడా మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము -
ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు! కానీ వారు ఫిర్ఔన్ ఆజ్ఞలనే అనుసరించారు. మరియు ఫిర్ఔన్ ఆజ్ఞ సరైనది కాదు.
పునరుత్థాన దినమున అతడు (ఫిర్ఔన్) తన జాతి వారికి మున్ముందుగా ఉండి, వారిని నరకాగ్నిలోకి తీసుకొని పోతాడు మరియు అది ప్రవేశించే వారికి ఎంత చెడ్డ గమ్యస్థానం.
మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దినమున కూడా (బహిష్కరించబడతారు). ఎంత చెడ్డ బహుమానం (వారికి) బహూకరించ బడుతుంది.
ఇవి కొన్ని (ప్రాచీన) పట్టణాల గాథలు వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి (మిగిలి) ఉన్నాయి. మరికొన్ని పంటపొలాల మాదిరిగా కోయబడ్డాయి (నిర్మూలించబడ్డాయి).
మరియు మేము వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఆజ్ఞ వచ్చినప్పుడు - అల్లాహ్ ను వదలి - వారు ఏ దేవతలనైతే ప్రార్థించేవారో! వారు, వారికి ఏ విధంగానూ సహాయపడ లేక పోయారు. మరియు వారు, వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు.
మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) పట్టుకొన (శిక్షించ) దలచితే, ఇలాగే పట్టుకుంటాడు (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధారకమైనది, ఎంతో తీవ్రమైనది.
నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు.
మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము.
ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు.
దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు.
వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు.
ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం.
కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాతముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా (అంధులై) ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా, వారి భాగపు (శిక్షను) ఏ మాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము.
మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట (ఆజ్ఞ) ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే, వారి తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారు దీనిని గురించి సంశయంలో, సందేహంలో పడి వున్నారు.
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చి వేస్తాడు. నిశ్చయంగా ఆయన వారి కర్మలను బాగా ఎరుగును.
కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాప పడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు.
దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి. నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవ్వరూ మీకు సంరక్షకులూ ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు.
మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).
మరియు సహనం వహించు; నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు.
మీకు పూర్వం గతించిన తరాల వారిలో, భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కాని అలాంటి వారు కొందరు మాత్రమే ఉండేవారు! వారిని మేము అలాంటి వారి (దుర్మార్గుల) నుండి కాపాడాము. మరియు దుర్మార్గులైన వారు ఐహిక సుఖాలకు లోనయ్యారు మరియు వారు అపరాధులు.
మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంత వరకు, అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు.
మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు -
నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.
మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు (ఈ సూరహ్) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక.
మరియు విశ్వసించని వారితో ఇలా అను: "మీరు మీ శక్తి మేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా, మేము కూడా మా శక్తి మేరకు మా పనులు చేస్తాము.
మరియు మీరు వేచి చూడండి; మేము కూడా వేచి ఉంటాము."
మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే తెలుసు. మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు.
Icon